పెనుగొలనులో ఘనంగా లోకమాన్య బాలగంగాధర తిలక్ వర్ధంతి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శనివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిలక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సాయిబాబా యూత్ కమిటీ అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞ కృష్ణ మాట్లాడుతూ, లోకమాన్య బాలగంగాధర తిలక్ 1856 జూలై 23న మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించారని తెలిపారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక నాయకుడిగా నిలిచిన తిలక్ "స్వరాజ్యం నా జన్మహక్కు, దానిని సాధించి తీరుతాను" అనే నినాదంతో దేశ ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించారని చెప్పారు. హిందువుల్లో ఐక్యత పెంపొందించేందుకు ఛత్రపతి శివాజీ జయంతి, గణేశ్ ఉత్సవాలను బహిరంగంగా నిర్వహించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన మహనీయుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.
మహిళా కమిటీ ఆర్గనైజర్ దేవర అంజలి మాట్లాడుతూ, స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటిష్ ప్రభుత్వం తిలక్ను బర్మాలోని మాండలే జైలుకు పంపిందని తెలిపారు. అక్కడే ఆయన ప్రసిద్ధ గ్రంథం 'గీతా రహస్యం' రచించారని చెప్పారు. 1920 ఆగస్టు 1న ముంబైలో తీవ్ర అనారోగ్యంతో తిలక్ కన్నుమూశారని పేర్కొంటూ, దేశ స్వాతంత్ర్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
కార్యక్రమంలో విద్యార్థులు, అంగన్వాడీ చిన్నారులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని లోకమాన్య బాలగంగాధర తిలక్కు ఘనంగా నివాళులర్పించారు.