పెనుగొలనులో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
బహుజన హక్కుల కోసం పోరాడిన మహనీయుడిగా కొనియాడిన వక్తలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు పాల్గొని పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 1650 ఆగస్టు 18న ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో ధర్మన్న, సర్వమ్మ దంపతులకు జన్మించారని తెలిపారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన పాపన్న కుటుంబ బాధ్యతలను చేపట్టి గౌడ వృత్తిని కొనసాగించారని వివరించారు.
రైతు సంఘం నాయకులు మీనుగు కృష్ణ మాట్లాడుతూ అప్పటి పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ పోరాటం సాగించారని తెలిపారు. ప్రజలపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని అనేక ప్రాంతాల్లో తన ప్రభావాన్ని చూపారని పేర్కొన్నారు. భువనగిరి, నల్గొండ, వరంగల్ తదితర ప్రాంతాల్లో ప్రజా సంక్షేమ పాలన అందించేందుకు కృషి చేశారని కొనియాడారు.
గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు వడ్డెబోయిన రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ కుల, మత భేదాలు లేకుండా అందరినీ సమానంగా గౌరవించిన నాయకుడని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలనే ఆశయంతో ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మెట్టగుట్ట శేషాచల శ్రీనివాస స్వామి కార్యవర్గ కమిటీ సభ్యులు వసుమర్తి లక్ష్మణరావు, గౌడ సంఘం నాయకులు పంది హనుమంతరావు గౌడ్, పంది కృష్ణారావు గౌడ్, తోట కృష్ణ గౌడ్, బోలగాని అంజి గౌడ్, పంది కృష్ణ గౌడ్తో పాటు మహిళలు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.