పెనుగొలనులో కరుణశ్రీ 114వ జయంతి వేడుకలు
పెనుగొలనులో కరుణశ్రీ 114వ జయంతి వేడుకలు
గంపలగూడెం, ఆగస్టు 4: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి (కరుణశ్రీ) 114వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి మాట్లాడుతూ, 1912 ఆగస్టు 4న గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించిన జంధ్యాల పాపయ్య శాస్త్రి 20వ శతాబ్దపు ప్రముఖ తెలుగు కవుల్లో ఒకరని తెలిపారు. సులభమైన శైలి, సమకాలీన భావజాలం, చక్కటి తెలుగు నుడికారంతో ఆయన రచనలు పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నాయని చెప్పారు.
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు కే. సుజాత మాట్లాడుతూ, ఖండకావ్యాల రచనలో జంధ్యాల పాపయ్య శాస్త్రి విశిష్ట స్థానాన్ని సంపాదించారని, కరుణరస ప్రధానంగా ఎన్నో రచనలు చేసి "కరుణశ్రీ"గా చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన రచించిన ఉదయశ్రీ, కరుణశ్రీ, విజయశ్రీ, కుంతీకుమారి, పుష్పవిలాపం వంటి కావ్యాలు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచాయని వివరించారు.
శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, తెలుగు సాహిత్యానికి చేసిన విశిష్ట సేవలకు గాను జంధ్యాల పాపయ్య శాస్త్రి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు తెలుగు అకాడమీ, అభినందన, రసమయి, శుభాంగి పురస్కారాలను అందుకున్నారని తెలిపారు. పద్యం, వచనం, గేయం వంటి విభిన్న ప్రక్రియల్లో 76కుపైగా రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని కొనియాడారు.
కార్యక్రమం సందర్భంగా శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఐదో తరగతి విద్యార్థులకు పరీక్షల కోసం ఎగ్జామ్ ప్యాడ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు, ఉపాధ్యాయులు ఎస్. శంకర్, ఆర్. మాణిక్యమ్మ, జి. అలేఖ్య, డి. బేబీ, విద్యార్థులు పాల్గొన్నారు.