పోలిశెట్టిపాడు గ్రామ సచివాలయంలో గ్రామసభ నిర్వహణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం పోలిశెట్టిపాడు గ్రామ సచివాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రజిని అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య పాల్గొని మాట్లాడారు.
పీఎం ఆవాస్ యోజన పథకం కింద పక్కా గృహాల కోసం అర్హులైన లబ్ధిదారుల పేర్లను గ్రామసభలో తీర్మానించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి పారదర్శకంగా అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తే గ్రామాల అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని వాసం మునియ్య పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ.కొండూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి గోగులముడి రామ్ ప్రసాద్ రెడ్డి, వీఆర్వో నాగుల్ మీరా, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.