ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంపొందించాలి: జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య
బడిబాట కార్యక్రమంలో అడ్మిషన్లు 10 శాతం పెరగాలి
జూన్ 15 నాటికి పాఠశాలలు సిద్ధం చేయాలి.. మొదటి రోజు నుంచే మధ్యాహ్న భోజనం
జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల నమోదును పెంపొందించాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. సోమవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల అదనపు కలెక్టర్ ఛాంబర్ నుండి జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, విద్యాశాఖ సహాయ సంచాలకులు లలితలతో కలిసి ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్ లతో జూమ్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 15న పాఠశాలలు ప్రారంభం అవుతున్నందున తరగతి గదులు, ఆవరణ, వంటగది శుభ్రం చేయించాలని, మధ్యాహ్న భోజనానికి అవసరమైన బియ్యం సమకూర్చుకుని మొదటి రోజు నుంచే భోజనం అమలు చేయాలని తెలిపారు.
జిల్లాలోని అన్ని మండలాలకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు చేరుకున్నాయని, వాటిని వెంటనే పాఠశాలలకు చేరవేయాలని మండల విద్యాధికారులకు సూచించారు. బడిబాట కార్యక్రమంలో గత సంవత్సరం కంటే ఈ ఏడాది అడ్మిషన్లను 10 శాతం పెంపొందించేలా కృషి చేయాలని తెలిపారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 5, 7, 8 తరగతులు పూర్తి చేసిన ప్రతి విద్యార్థిని సమీప ఉన్నత పాఠశాలల్లో తప్పకుండా చేర్పించాలన్నారు. నూతన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు యు-డైస్ (U-DISE) స్టూడెంట్ మాడ్యూల్ లో విద్యార్థుల వివరాలను ఇంపోర్ట్ చేయాలని, 10వ తరగతి పూర్తి చేసిన వారిని సమీప జూనియర్ కళాశాలల్లో చేర్పించి, విద్యార్థులు డ్రాప్ అవుట్ కాకుండా 100 శాతం చదువు కొనసాగించేలా చూడాలని పేర్కొన్నారు.
పాఠశాలలను వదిలి వెళుతున్న విద్యార్థులకు బదిలీ సర్టిఫికెట్ (TC) ఇచ్చే క్రమంలో, వారు కొత్తగా చేరిన పాఠశాల ప్రవేశ వివరాలను రికార్డుల్లో భద్రపరిచి ఎంఈఓలకు సమర్పించాలని, తద్వారా డ్రాప్ బాక్స్ లో ఏ విద్యార్థి ఉండకుండా చూడాలని తెలిపారు. భవిత కేంద్రాలు సరైన క్రమంలో నడిచేలా చూడాలని, జూన్ 15న ఏ పాఠశాల అయినా పునఃప్రారంభం కానట్లయితే సంబంధిత హెచ్ఎంలపై చర్యలు ఉంటాయని తెలిపారు. అలాగే ప్రైవేటు పాఠశాలలు తమ ఫీజుల వివరాలను నోటీస్ బోర్డులపై ప్రదర్శించాలని, విద్యాధికారులు వీటిపై పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు ఎం.భరత్ కుమార్, జే. సత్తయ్య, కె. కృష్ణమూర్తి, కే.విజయలక్ష్మి, ఏ.రాజ్ కుమార్ పాల్గొన్నారు