ప్రభుత్వ విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ ధర్నా
ప్రభుత్వ విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చిట్యాల మండల విద్యాధికారి కార్యాలయం ముందు భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు అరూరి ప్రణీత్, ముసుగు రవీందర్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని వారు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థి, విద్యార్థినులందరికీ తక్షణమే రెండు జతల యూనిఫాంలు, పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేయాలి అని డిమాండ్ చేశారు. మండలంలోని రెండు బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ట్రంకు బాక్సులు అందించడంతో పాటు, అక్కడ మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి అని, విద్యార్థుల సమస్యలపై పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సదరు అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా ప్రభుత్వ బడుల్లో సమస్యలు మాత్రం తీరడం లేదు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తాం.అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ సభ్యులు బొడ్డుపల్లి శశికుమార్, గోల్చింటూ, శివప్రసాద్, సంజయ్లతో పాటు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థి, విద్యార్థినులు పాల్గొన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు సమర్పించారు.