ప్రజా ఆస్తుల పరిరక్షణ అందరి బాధ్యత
ప్రజా ఆస్తుల పరిరక్షణ అందరి బాధ్యత: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
తిరువూరు: ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటోందని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.
క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన రహదారులు కొందరి నిర్లక్ష్యం వల్ల దెబ్బతినడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజలకు అందుతున్న సౌకర్యాలు, అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
కొత్తగా నిర్మించిన రోడ్లపై భారీ వాహనాలు, ఫుల్ వీల్స్ ట్రాక్టర్లు నడపడం వల్ల రహదారుల నాణ్యత దెబ్బతింటుందని, వాహనదారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రైతులు, ప్రజలు రోడ్లను తమ సొంత ఆస్తిగా భావించి సంరక్షించుకోవాలని కోరారు.
ప్రభుత్వ నిధులతో నిర్మించే ప్రతి రహదారి ప్రజల ఆస్తి అని, అభివృద్ధిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపేందుకు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు చెప్పారు.