ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్ కుమార్ దీపక్
క్షేత్రస్థాయి పరిశీలనతో బాధితులకు న్యాయం చేయాలి
అదనపు కలెక్టర్లతో కలిసి అర్జీలు స్వీకరించిన జిల్లా యంత్రాంగం
మంచిర్యాల ప్రజావాణిలో వెల్లువెత్తిన వినతులు
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి. రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్ లతో కలిసి ఆయన బాధితుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై అధికారులకు అర్జీలు సమర్పించారు. ఇందులో జన్నారానికి చెందిన రాజు గౌడ్ తనకు ఉపాధి కల్పించాలని, చెన్నూరుకు చెందిన సైదల పద్మ ప్రజా పాలన వివరాల మార్పు చేయాలని, బట్వాన్ పల్లికి చెందిన కడారి బీరయ్య తన వ్యవసాయ భూమిలోకి వస్తున్న మురుగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. అలాగే వృద్ధాప్యంలో కొడుకులు వేధిస్తున్నారని మంచిర్యాలకు చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి జె.శాంతయ్య, తండ్రి భూమి అక్రమ పట్టా అయిందని ముత్తారానికి చెందిన బుర్ర లచ్చయ్య, దివ్యాంగ పింఛన్ ఆగిపోయిందని కొత్తపల్లికి చెందిన అంగడి రాములు కలెక్టర్కు విన్నవించుకున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వినతులలో.. మంచిర్యాల హమాలివాడ నివాసితులు నివాస గృహాల మధ్య బార్ ఏర్పాటును నిలిపివేయాలని దరఖాస్తు చేయగా, చెన్నూరుకు చెందిన తన్నీరు ప్రమీల తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. వీటితో పాటు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల పట్టికను నోటీస్ బోర్డులో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ప్రజల నుండి వచ్చిన ఈ దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన కలెక్టర్, ఆయా శాఖల అధికారులతో మాట్లాడి బాధితులకు త్వరగా న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు