ప్రపంచ తాబేలు దినోత్సవం సందర్భంగా ప్రకృతి పరిరక్షణకు పిలుపు
ప్రపంచ తాబేలు దినోత్సవం సందర్భంగా ప్రకృతి పరిరక్షణకు పిలుపు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలనులో శనివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో “ప్రపంచ తాబేలు దినోత్సవం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో తాబేళ్ల పాత్ర ఎంతో కీలకమని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సాయిబాబా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే 23న ప్రపంచవ్యాప్తంగా తాబేలు దినోత్సవాన్ని నిర్వహిస్తూ తాబేళ్ల మనుగడపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. చెరువులు, నదుల్లో పెరిగే కీటకాలు, పాచిని తినడం ద్వారా తాబేళ్లు జలవనరులను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతున్నాయని వివరించారు.
అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా నీటి వనరులను కలుషితం కాకుండా కాపాడాలని, జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం ద్వారానే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ప్రకృతిని అందించగలమని సూచించారు.
ఈ కార్యక్రమంలో మహిళా మండలి సభ్యులు, విద్యార్థులు, గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొని తాబేళ్ల సంరక్షణపై ప్రతిజ్ఞ చేశారు.