ప్యారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందు అమ్మకాలపై తాత్కాలిక నిషేధం
ప్యారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందు అమ్మకాలపై తాత్కాలిక నిషేధం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలో ప్యారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్.ఎల్ కలుపు మందు అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మీ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు వ్యవసాయ శాఖ తాజా మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా విస్సన్నపేట మండలంలోని పలు పురుగుమందుల దుకాణాలను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి, సుమారు 2250 లీటర్ల ప్యారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్.ఎల్ స్టాకులపై “స్టాప్ సేల్” ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీలర్లలో అప్రమత్తత నెలకొంది.
అలాగే మండలంలోని పురుగుమందుల డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన అధికారులు, ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ కలుపు మందును ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదని స్పష్టం చేశారు. రైతులు కూడా ఈ మందును కొనుగోలు చేయకుండా, వినియోగించకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
రైతుల భద్రత, పంటల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది.