రాబోయే తరాలకు ప్రకృతి సంపదను అందిద్దాం: పులుల సంరక్షణ సామాజిక బాధ్యత – ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జూలై 29: అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజలకు ప్రత్యేక సందేశం అందించారు. రాబోయే తరాలకు సంపన్నమైన ప్రకృతి వారసత్వాన్ని అందించాలంటే పులుల సంరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.
పులి అడవికి ప్రతీక మాత్రమే కాదని, ప్రకృతి సమతుల్యతను కాపాడే రారాజు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పులులు సురక్షితంగా ఉంటే అడవులు సురక్షితంగా ఉంటాయని, తద్వారా జీవవైవిధ్యం, నీటి వనరులు, పర్యావరణం కూడా రక్షితంగా నిలుస్తాయని వివరించారు.
పులుల నివాస ప్రాంతాలను సంరక్షించడం, అడవుల విధ్వంసాన్ని అరికట్టడం, వన్యప్రాణుల అక్రమ వేటను పూర్తిగా నిరోధించడం, పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
ప్రకృతి పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెరిగితేనే పులులతో పాటు మొత్తం జీవవైవిధ్యాన్ని కాపాడగలమని, భవిష్యత్ తరాలకు సుసంపన్నమైన ప్రకృతి సంపదను అందించగలమని ఎనుముల రేవంత్ రెడ్డి ఆకాంక్ష వ్యక్తం చేశారు.