రాష్ట్ర మంత్రివర్గ కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్ర మంత్రివర్గ కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు 55కు పైగా అజెండా అంశాలపై చర్చించిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రూరల్ ప్రాంతాల్లో బీసీలకు 34 శాతం, అర్బన్ ప్రాంతాల్లో 33.1 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. అక్టోబర్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఆర్థిక సంఘం నిధులు రూ.16,500 కోట్లు మురిగిపోకుండా ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.
మేయర్ల ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని, పాత విధానంలో ఒక డిప్యూటీ మేయర్ పదవికే పరిమితం కావాలని కేబినెట్ నిర్ణయించింది.
పరిశ్రమలు, ఐటీ, ఇంధనం, పర్యాటక రంగాలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. కర్నూలులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 12 గిగావాట్ల సిలికాన్ ఇంగాట్, వేఫర్ ప్లాంట్ ప్రతిపాదనలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విశాఖలో అక్షత్ గ్రీన్టెక్ సోలార్ సెల్, మాడ్యూల్ ప్లాంట్, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలను కేబినెట్ ఆమోదించింది.
తిరుపతి, సూర్యలంక, కేశరపల్లి, కాకినాడ ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. ఇంధన రంగంలో హైబ్రిడ్, సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
అమరావతి రైల్వే లైన్కు సంబంధించి ల్యాండ్ పూలింగ్ విధానంపై నిర్ణయం తీసుకుంది. హ్యామ్ మోడల్లో రూ.7,469.46 కోట్లతో రోడ్లు, పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీ విద్యార్థుల కోసం జేఈఈ, నీట్ శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు బిల్లుకు, ఉన్నత విద్యలో ఫీజుల నిర్ణయానికి కొత్త కమిషన్ బిల్లు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఏపీఎస్బీసీఎల్కు రూ.5 వేల కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణం ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది.
అవయవ మార్పిడికి సంబంధించిన ట్రాన్స్ప్లాంటేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిన కేబినెట్, హెచ్ఎన్ఎస్ఎస్ రెండో దశ నీటి ప్రాజెక్టులపై కూడా చర్చించింది.