రాష్ట్రంలో మూడు రోజులపాటు భారీ వర్షాల హెచ్చరిక.. యంత్రాంగం అప్రమత్తం
రాష్ట్రంలో మూడు రోజులపాటు భారీ వర్షాల హెచ్చరిక.. యంత్రాంగం అప్రమత్తం
హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర ఒడిశా ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల 30, 31 తేదీల్లోనూ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగనున్నాయని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ప్రజలు అత్యవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
భారీ వర్షాలపై ప్రభుత్వ అప్రమత్తత.. కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు
రానున్న రెండు, మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భద్రాచలం, ములుగు, నిర్మల్ జిల్లాల్లో ఎన్డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని, అవసరమైతే హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అదనపు బృందాలను తరలిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైందని, ఎక్కువ జిల్లాల్లో లోటు వర్షపాతం ఉన్నందున వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను వేగవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు అవసరమైన విత్తనాలు, సాంకేతిక సహాయం అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎస్ స్పష్టం చేశారు.