రైస్ మిల్లు కాలుష్యంపై చిట్యాల ప్రజలు కమిషనర్ కు వినతి
రైస్ మిల్లు కాలుష్యంపై చిట్యాల ప్రజలు కమిషనర్ కు వినతి NTODAY NEWS చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లు నుండి వెలువడుతున్న నల్లటి బూడిద, పొట్టు ఇతర కాలుష్యకారక పదార్థాల నుండి తమను కాపాడాలని కోరుతూ చిట్యాల పట్టణ కేంద్రంలోని ఎనిమిదో వార్డు ప్రజలు గురువారం మున్సిపల్ కమిషనర్ గురుస్వామిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ. శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లు ద్వారా వచ్చే నల్లటి బూడిద, పొట్టు వల్ల తాము తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యం కారణంగా శ్వాసకోశ ఇబ్బందులతో పాటు చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వాపోయారు.
అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై మండిపాటు ఈ సమస్య గత ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులు గాని, అధికారులు గానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాజకీయ పలుకుబడితో రైస్ మిల్లు యాజమాన్యం మా కాలనీని కాలుష్యకారక బూడిదతో ముంచెత్తుతోంది అని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ తీవ్రమైన సమస్యను వెంటనే పరిష్కరించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న రైస్ మిల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలుష్యానికి కారణమవుతున్న సదరు మిల్లును పూర్తిగా మూసి వేయించాలని, లేనిపక్షంలో కాలనీవాసులమంతా కలిసి మిల్లు ముందు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం చైర్మన్ జిట్ట రవి , పాల భవాని పాల రమేష్, బోడ రమేష్, పిల్లి యాదయ్య జిట్టా మంగమ్మ, పోకల సరస్వతి, కుక్కల అనిత, చింత నీలమ్మ, పాల ఈశ్వరమ్మ, జిట్టా నాగమ్మ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.