రైతు ఉద్యమ యోధుడు ప్రేమ్ సింగ్ గెల్హాట్ మృతి తీరని లోటు: డి.హరినాధ్
విజయవాడ, జులై 4: రైతు, కార్మిక ఉద్యమాల కోసం జీవితాంతం పోరాడిన సీనియర్ ఉద్యమ నాయకుడు కామ్రేడ్ ప్రేమ్ సింగ్ గెల్హాట్ మృతి పట్ల అఖిల భారత కిసాన్ మహాసభ (ఏఐకేయం), సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రేమ్ సింగ్ గెల్హాట్తో తమకు నాలుగు దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన సేవలను స్మరించుకున్నారు.
దాదాపు 40 ఏళ్ల క్రితం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఐపీఎఫ్ జాతీయ మహాసభలకు కేంద్ర బాధ్యులుగా వచ్చి సభలను విజయవంతం చేయడంలో ప్రేమ్ సింగ్ కీలక పాత్ర పోషించారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.హరినాధ్ తెలిపారు. అప్పటి నుంచి ఏర్పడిన స్నేహబంధం ఆయన చివరి వరకు కొనసాగిందన్నారు. అఖిల భారత కిసాన్ మహాసభ జాతీయ కార్యవర్గంలో కలిసి పనిచేసే అవకాశం లభించిందని, తరచూ కలుస్తూ ఉద్యమాలపై చర్చలు జరుపుతూ ఎంతో ఆత్మీయంగా ఉండేవారని పేర్కొన్నారు.
హర్యానా, ఢిల్లీలో రైతు, కార్మిక ఉద్యమాలను బలోపేతం చేయడంలో ప్రేమ్ సింగ్ విశేష కృషి చేశారని, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సమన్వయకర్తగా రైతాంగ పోరాటాలకు సమర్థ నాయకత్వం అందించారని కొనియాడారు. రాజస్థాన్లోని జుంజునూ నుంచి ఢిల్లీ వరకు ప్రేమ్ సింగ్ పార్థివదేహాన్ని అంబులెన్స్లో పురుషోత్తమ్ శర్మ, తాము, మరో కామ్రేడ్ కలిసి తీసుకువచ్చామని, అనంతరం రాజారాం సింగ్ ఎంపీ క్వార్టర్స్లో సందర్శనార్థం ఉంచినట్లు వివరించారు.
ప్రేమ్ సింగ్ గెల్హాట్ మరణం రైతు ఉద్యమాలకు, పేద ప్రజల పోరాటాలకు తీరని లోటని పేర్కొన్న డి.హరినాధ్, ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తి భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. ఆయన మృతికి ఆంధ్రప్రదేశ్ అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కమిటీ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.