రెడ్డిగూడెం: స్కీం వర్కర్లకు 3 నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి
సెప్టెంబర్ 12న విజయవాడ ధర్నా చౌక్లో భారీ ధర్నా చేపడతాం
రెడ్డిగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కీం వర్కర్లకు మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న మెనూ చార్జీలు, గౌరవ వేతనాలు, శానిటేషన్ కార్మికులైన ఆయాల జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రెడ్డిగూడెం మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఏఐసీసీటీయూ అనుబంధ స్కీం వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సభ్యురాలు పరికల కళావతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ ధర్నాకు హాజరైన సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి డి. పుల్లారావు, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు టి. అరుణ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న శానిటేషన్ కార్మికులు, వంట ఏజెన్సీలు అతి తక్కువ వేతనాలతో, ప్రభుత్వం అందిస్తున్న తక్కువ మెనూ చార్జీలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ పాలకులు కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వంట ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన మెనూ చార్జీలు, గౌరవ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సెప్టెంబర్ 12న వందలాది మంది స్కీం వర్కర్లతో విజయవాడ ధర్నా చౌక్లో భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు.
స్కీం వర్కర్లకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, కార్మికుల జీవనోపాధిని దెబ్బతీసే స్మార్ట్ కిచెన్ కేంద్రాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతన చట్టం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నెలకు రూ.26 వేల వేతనం చెల్లించాలని కోరారు.
నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, స్కీం వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డి. పుల్లారావు డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని, ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని, ఏడాదికి 12 నెలల వేతనాలు, గ్రాట్యుటీ, నెలకు రెండు సెలవులు మంజూరు చేయాలని కోరారు. అలాగే రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం మండల తహశీల్దార్, మండల విద్యాశాఖ అధికారికి విడివిడిగా వినతిపత్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో స్కీం వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సభ్యులు బి. పూజిత, పరికల కళావతి, గూంట్రు భూషిమ్మ, డి. రాజ్యలక్ష్మి, హేమలత, కంచర్ల సుమతి, జ్ఞానసుందరి, ఎం.ఏ.సమ్మ, బి. మారయ్య తదితరులు పాల్గొన్నారు.