రహదారి భద్రతే – మహా రక్ష...
రహదారి భద్రతే – మహా రక్ష...
అన్నమయ్య జిల్లా -
మదనపల్లి.
*అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఇంచార్జి కలెక్టర్ శ్రీ శివ్ నారాయణ శర్మ ఐఏఎస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు.*
మదనపల్లె కలెక్టరేట్లో విజయవంతంగా ముగిసిన జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీ (డీఆర్ఎస్సీ) ఉన్నత స్థాయి సమావేశం.
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టి, ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా జిల్లా యంత్రాంగం కీలక అడుగులు వేసింది. మంగళవారం మదనపల్లె కలెక్టరేట్లో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ (డీఆర్ఎస్సీ) ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీ శివ్ నారాయణ శర్మ ఐఏఎస్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు పాల్గొని, రహదారి భద్రతా చర్యలు, ప్రమాదాల నివారణపై వివిధ శాఖల అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
*జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ..*
విద్యాసంస్థలు, రద్దీగా ఉండే ముఖ్యమైన ప్రాంతాల వద్ద పాదచారుల కోసం తప్పనిసరిగా జీబ్రా క్రాసింగ్లను ఏర్పాటు చేయాలి.
జాతీయ రహదారుల పై పేరుకుపోయిన దుమ్ము, ధూళిని ఎప్పటికప్పుడు తొలగించాలి.
కచ్చితంగా వీధి దీపాలు వెలిగేలా చూసి రహదారి భద్రతను మెరుగుపరచాలి.
ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, ఆయా శాఖల అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించాలి. అక్కడ తక్షణమే కనీస భద్రతా చర్యలు చేపట్టాలి.
ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు అన్నమయ్య జిల్లాకు ప్రత్యేకంగా ఒక 'ట్రామా కేర్ సెంటర్' ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు నిలబెట్టే 'రహ్ వీర్' లను ఆగస్టు 15 నాటికి గుర్తించి సత్కరించేలా చర్యలు తీసుకోవాలి.
జాతీయ రహదారుల వెంబడి తగిన వెలుతురు, కనీస సౌకర్యాలతో కూడిన వాహనదారుల విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
పట్టణాల్లో ట్రాఫిక్ కు, పాదచారులకు అంతరాయం కలిగించే చెత్త కుండీలు, ఇతర అడ్డమైన వస్తువులను తక్షణమే తొలగించాలన్నారు.
*జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..*
రాత్రి వేళల్లో ప్రమాదాల బారిన పడకుండా వ్యవసాయ ట్రాక్టర్ల వెనుక భాగంలో తప్పనిసరిగా రేడియం రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలి.
రహదారులపైకి వచ్చే పశువులను దూరం నుండే గుర్తించేందుకు వీలుగా వాటి మెడలకు రిఫ్లెక్టివ్ కాలర్ టేపులు కట్టాలి.
సాయంత్రం 6:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల మధ్య కాలంలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించాము. ఆ సమయంలో పోలీస్ నిఘా, వాహన తనిఖీలను మరింత కఠినతరం చేయాలి.
అనధికార పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు నిలపకుండా 'నో పార్కింగ్' సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.
మదనపల్లె పట్టణంలో వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారిన అనవసరమైన స్పీడ్ బ్రేకర్లను వెంటనే తొలగించాలి.
ఆటోల కోసం ప్రత్యేకంగా స్థలాలను గుర్తించి, వాటిని అక్కడే నిలిపేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రి గారు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను రక్షించే 'రహ్ వీర్' పథకం మరియు 'పీఎం రాహత్' పథకాల మార్గదర్శకాలను అధికారులకు వివరించారు.
సమావేశంలో మున్సిపల్ కమిషనర్ (మదనపల్లె), రాయచోటి డీఎస్పీ శ్రీ ఎం.ఆర్. కృష్ణమోహన్ గారితో పాటు, రవాణా, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, జాతీయ రహదారుల సంస్థ మరియు మదనపల్లె, రాయచోటి ట్రాఫిక్ సీఐలు, తదితర సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.