రిటైర్మెంట్ డబ్బుల విషయంలో గొడవ.. భర్తను రోకలిబండతో కొట్టి భార్య హత్య
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సంచలనం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి విషయంలో జరిగిన వివాదం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. భర్తను భార్య రోకలిబండతో కొట్టి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్లో వెంకటేశం అనే వ్యక్తి భార్య రాజమణి చేతిలో హత్యకు గురయ్యాడు. వెంకటేశం ఆసిఫాబాద్లో వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా పనిచేస్తుండగా, రాజమణి ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ నెలలో వెంకటేశం పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో రిటైర్మెంట్కు వచ్చే నగదు, ఆస్తుల విషయంలో భార్యాభర్తల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో జరిగిన గొడవ తీవ్రరూపం దాల్చడంతో రాజమణి రోకలిబండతో భర్తపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
తీవ్రంగా గాయపడిన వెంకటేశం మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, భార్య రాజమణిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.