రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల తర్వాత ఊరట.. క్లర్క్, ప్యూన్కు సుప్రీంకోర్టు క్లీన్చిట్
దాదాపు మూడు దశాబ్దాల న్యాయ పోరాటానికి తెరపడింది. రూ.20 లంచం ఆరోపణల కేసులో గుజరాత్ ప్రభుత్వానికి చెందిన ఓ క్లర్క్, ప్యూన్కు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. దిగువ కోర్టులు, గుజరాత్ హైకోర్టు విధించిన శిక్షలను రద్దు చేస్తూ ఇద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది.
1996లో విద్యార్థికి ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు రూ.120 లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలతో కేసు నమోదైంది. ఏసీబీ నిర్వహించిన ట్రాప్లో ప్యూన్ వద్ద రూ.20 నగదు లభించగా, క్లర్క్ వద్ద ఆరోపించిన రూ.100 దొరకలేదు.
అయితే లంచం డిమాండ్ చేసినట్లు నిరూపించే బలమైన ఆధారాలు లేవని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఫిర్యాదుదారు వాంగ్మూలంలోనూ పలు వ్యత్యాసాలు ఉన్నాయని గుర్తించింది.
కేవలం రూ.20 నగదు స్వాధీనం చేసుకున్నారనే కారణంతోనే లంచం డిమాండ్, స్వీకరణ జరిగినట్లు నిర్ధారించలేమని స్పష్టం చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద నేర నిర్ధారణకు అవసరమైన ఆధారాలు లేవని తేల్చింది.
దీంతో దిగువ కోర్టు, గుజరాత్ హైకోర్టు తీర్పులను కొట్టివేసి.. క్లర్క్, ప్యూన్ ఇద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది. 30 ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో ముగింపు లభించింది.