రూ.35 వేల లంచంతో ఏసీబీకి అడ్డంగా దొరికిన లైన్మెన్
రూ.35 వేల లంచంతో ఏసీబీకి అడ్డంగా దొరికిన లైన్మెన్
యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ లైన్మెన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. మోటకొండూరు మండలంలోని మేడికుంటపల్లి గ్రామానికి చెందిన రైతు అనంతరెడ్డి తన వ్యవసాయ భూమి వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని అధికారుల చుట్టూ మూడు నెలలుగా తిరుగుతున్నాడు. ఇందుకోసం ఇప్పటికే రూ.30 వేల డీడీలు కూడా చెల్లించాడు.
అయినా పని పూర్తి కాకపోవడంతో పలుమార్లు ఏఈ, అసిస్టెంట్ లైన్మెన్ను సంప్రదించాడు. పని పూర్తయ్యాక రూ.10 వేల వరకు ఇస్తానని చెప్పినా, అసిస్టెంట్ లైన్మెన్ రమేష్ మాత్రం లంచం ఇస్తేనే పని జరుగుతుందని పట్టుబట్టినట్లు సమాచారం.
ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం రూ.35 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో విసిగిపోయిన రైతు అనంతరెడ్డి రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రెక్కీ నిర్వహించారు.
ఈ క్రమంలో అనంతరెడ్డి ఇంటి వద్ద రమేష్ రూ.35 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లంచం అడిగే అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ప్రజలు భయపడకుండా ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు సూచించారు.