సీపీఎం సీనియర్ నాయకురాలు యార్లగడ్డ జోయకు తిరువూరులో ఘన నివాళి
తిరువూరు, జూలై 25: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరులోని విజ్ఞాన కేంద్రంలో శనివారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సీపీఎం సీనియర్ నాయకురాలు, మహిళా సంఘం అగ్రనేత యార్లగడ్డ జోయ సంతాప సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు జోయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సభలో సీపీఎం సీనియర్ నాయకుడు సానికొమ్ము నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ జోయ జీవితాంతం పేదల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేశారని అన్నారు. మహిళల హక్కుల సాధన కోసం నిరంతరం ఉద్యమాలు నిర్వహించారని, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు. ఆమె ప్రజాసేవ, ఉద్యమ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మేకల నాగేంద్ర ప్రసాద్, నాయకులు బి. వెంకటేశ్వరావు, ఎస్. వెంకటేశ్వర్లు, పి. శ్రీనివాసరావు, ఎస్వీ భద్రం, ఎస్. సురేష్, ఎం. చింతయ్య, ఆకుల రవి, ఎస్. నాగులు, మీరా, ఎం. తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.