సిద్దిపేట జిల్లాలో సహకార పదవులపై ఆశావహుల కన్ను
సిద్దిపేట జిల్లాలో సహకార పదవులపై ఆశావహుల కన్ను
21 పీఏసీఎస్లలో చైర్మన్, డైరెక్టర్ పదవుల కోసం నేతల ప్రయత్నాలు
సిద్దిపేట: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల నియామక ప్రక్రియతో సిద్దిపేట జిల్లాలో రాజకీయ వేడి పెరుగుతోంది. సహకార సంఘాల పాలకవర్గాల గడువు ముగియడంతో ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం నామినేషన్ విధానంలో చైర్మన్లు, డైరెక్టర్లను నియమిస్తోంది. దీంతో ఆయా పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.
జిల్లాలో 21 పీఏసీఎస్లు
సిద్దిపేట జిల్లాలో మొత్తం 21 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఇప్పటికే మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని బెజ్జంకి సొసైటీ పాలకవర్గాన్ని ఖరారు చేయడంతో మిగతా సొసైటీల పరిధిలోని ఆశావహులు అప్రమత్తమయ్యారు.
సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాలతో పాటు జనగామ, మానకొండూరు నియోజకవర్గాలకు చెందిన కొన్ని మండలాలు జిల్లాలో ఉన్నాయి. ఒక్కో సొసైటీలో చైర్మన్తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించనుంది. నియమితులైన డైరెక్టర్లలో ఒకరిని వైస్ చైర్మన్గా ఎంపిక చేసే అవకాశం ఉంది.
బెజ్జంకి సొసైటీ చైర్మన్గా వొగ్గు దామోదర్తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నామినేట్ చేయగా, ఇప్పటికే ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది.
పదవుల కోసం నేతల ముమ్మర ప్రయత్నాలు
సహకార సంఘాల పదవులు ఎన్నికల ద్వారా కాకుండా ప్రభుత్వ నామినేషన్ ద్వారా భర్తీ అవుతుండటంతో పలువురు నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటికే కొన్ని సొసైటీలకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తయినప్పటికీ మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే పరిస్థితి కనిపించకపోవడంతో ఏదైనా నామినేటెడ్ పదవి దక్కించుకోవాలనే లక్ష్యంతో నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. చైర్మన్ పదవుల కోసం ముఖ్య నేతల మద్దతు కోరుతుండగా, గ్రామస్థాయి నాయకులు డైరెక్టర్ పదవులపై ఆసక్తి చూపుతున్నారు.
జిల్లాలో సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం, సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవులు ఇంకా భర్తీ కావాల్సి ఉండగా, సహకార సంఘాల పదవుల భర్తీ ప్రక్రియ ఆశావహుల్లో మరింత ఉత్సాహం పెంచుతోంది.
నియోజకవర్గ ఇన్చార్జీలదే కీలక పాత్ర
సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లోని సహకార సంఘాల పాలకవర్గాల ఎంపికలో నియోజకవర్గ ఇన్చార్జీల నిర్ణయం కీలకంగా మారనుంది. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీలు పదవుల ఖరారులో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.
సిద్దిపేటలో పూజ హరికృష్ణ, దుబ్బాకలో చెరుకు శ్రీనివాసరెడ్డి, గజ్వేల్లో తూంకుంట నర్సారెడ్డి తమ పరిధిలోని సొసైటీ పదవులపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు మద్దతు కోసం పలువురు ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.