సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి తృటిలో తప్పిన లిఫ్ట్ ప్రమాదం!
మంత్రి అడ్లూరికి తృటిలో తప్పిన ప్రమాదం!
కరీంనగర్ ‘వన్ ఆస్పత్రి’లో అదుపుతప్పిన లిఫ్ట్
రెండో అంతస్తు నుండి వేగంగా వచ్చి గ్రౌండ్ ఫ్లోర్కు తగిలిన లిఫ్ట్
క్షేమంగా బయటపడ్డ మంత్రి లక్ష్మణ్ కుమార్
ఊపిరి పీల్చుకున్న అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ పట్టణంలోని 'వన్ ఆసుపత్రి'లో బుధవారం లిఫ్ట్ అదుపుతప్పడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
అసలేం జరిగిందంటే:
గొల్లపల్లి మండలానికి చెందిన ఒక పార్టీ కార్యకర్త అనారోగ్యంతో వన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సదరు కార్యకర్తను పరామర్శించేందుకు మంత్రి అడ్లూరి అక్కడికి వెళ్లారు. పరామర్శ అనంతరం మంత్రి తిరిగి వస్తుండగా, రెండో అంతస్తులో ఆయన లిఫ్ట్ ఎక్కారు. అయితే, సాంకేతిక లోపం కారణంగా లిఫ్ట్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి, రెండో ఫ్లోర్ నుండి అత్యంత వేగంగా కిందికి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ వద్ద గట్టిగా తాకింది.
క్షేమంగా బయటపడ్డ మంత్రి:
లిఫ్ట్ వేగంగా కింద పడటంతో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. అయితే, అదృష్టవశాత్తూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాపాయం నుండి క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనతో మంత్రి అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మంత్రి క్షేమంగా ఉన్నారని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
యాజమాన్యంపై చర్యలకు ఆదేశం:
ఆసుపత్రుల్లో కనీస నిర్వహణ లోపించడంపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోగులు, సందర్శకుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయన సూచించారు.