బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు
మచిలీపట్నం: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే బైండోవర్ చర్యల ప్రధాన ఉద్దేశమని కృష్ణా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులు, తరచూ నేరాలకు పాల్పడుతున్న నేరచరిత్ర కలిగిన వారి పట్ల చట్టప్రకారం బైండోవర్ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, బైండోవర్ అనేది శిక్ష కాదని, వ్యక్తి సత్ప్రవర్తనతో ఉండేందుకు, నేరాలకు పాల్పడకుండా ముందస్తుగా నివారించేందుకు చట్టం కల్పించిన చర్య అని చెప్పారు. సంబంధిత ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట బాండ్ అమలు చేయించబడుతుందని, నిర్ణయించిన కాలంలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
జిల్లాలో 2026 జనవరి నుంచి ఇప్పటి వరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 1,997 మంది ముద్దాయిలను సంబంధిత మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ల ఎదుట హాజరుపరచి బైండోవర్ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
అయితే బైండోవర్లో ఉన్నప్పటికీ 18 మంది ముద్దాయిలు మళ్లీ నేరాల్లో పాల్గొన్నట్లు గుర్తించామని చెప్పారు. వారిలో ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష విధించి, వారిని కు తరలించినట్లు తెలిపారు. మరో ఏడుగురు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విధించిన జరిమానాను చెల్లించగా, మిగిలిన ఎనిమిది మంది కేసులు విచారణలో ఉన్నాయని పేర్కొన్నారు.
బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని తెలిపారు.
ప్రజల భద్రత, శాంతియుత వాతావరణం, నేరాల నియంత్రణే కృష్ణా జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ స్పష్టం చేశారు.