గచ్చిబౌలిలో భారీ ఉద్యోగ మోసం.. 250 మందికి టోకరా
హైదరాబాద్ గచ్చిబౌలిలోని వాసవి స్కై సిటీ భవనంలో నిర్వహించిన ఆర్ఎం1 కోడర్స్ హబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ పేరుతో ఓ స్టార్టప్ కంపెనీ భారీ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంపెనీ నిర్వాహకులు రాము, జయంత్లు బ్యాక్డోర్ ఉద్యోగాల పేరుతో సుమారు 250 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షలు వసూలు చేసి, అనంతరం కంపెనీని మూసివేసి పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
బాధితుల కథనం ప్రకారం, 2025 సెప్టెంబర్లో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కన్సల్టెన్సీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి యువతను నియమించుకున్నారు. అయితే ఉద్యోగాల్లో చేరిన తర్వాత నెలలు గడిచినా జీతాలు చెల్లించలేదని, "ఇది స్టార్టప్ కంపెనీ.. త్వరలో ప్రాజెక్టులు వస్తాయి.. పెండింగ్ జీతాలన్నీ ఒకేసారి చెల్లిస్తాం" అంటూ యాజమాన్యం నమ్మించిందని బాధితులు చెబుతున్నారు.
2026 జనవరి నాటికీ ఒక్క రూపాయి జీతం కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగులు యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో కంపెనీ కార్యాలయాన్ని అకస్మాత్తుగా మూసివేసి నిర్వాహకులు పరారైనట్లు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై నిందితుడు రాము మామిడిపై ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అయితే కేసు నమోదైనప్పటికీ నిందితులు రాము మామిడి, జయంత్ కుందేటి, రాము తండ్రి మామిడి కనకయ్య స్వేచ్ఛగా తిరుగుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమ నుంచి తీసుకున్న డబ్బులను తిరిగి ఇప్పించి, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను కోరుతున్నారు.