అనుమతులు లేకుండా పుస్తకాలు, యూనిఫామ్స్ విక్రయం ఫాతిమా స్కూల్పై DSFI ధర్నా.. విద్యాశాఖ అధికారుల సీజ్!
మహబూబాబాద్ జిల్లా కేంద్రం:
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా పాఠశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాలు, టైలు, బెల్టులు, యూనిఫామ్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపిస్తూ డీఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం పాఠశాల ఎదుట భారీ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కేలోత్ సాయి కుమార్, నాయకుడు సూర్యప్రకాష్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలు విద్యా నియమాలను ఉల్లంఘించి వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాల ప్రాంగణంలో పుస్తకాలు, యూనిఫామ్లు, ఇతర సామగ్రి విక్రయించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, ఫాతిమా స్కూల్ యాజమాన్యం వాటిని పట్టించుకోకుండా తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తోందని ఆరోపించారు.
బయట మార్కెట్తో పోలిస్తే రెట్టింపు ధరలకు పుస్తకాలు, టైలు, బెల్టులను బలవంతంగా విక్రయిస్తూ లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్న ఇలాంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి సంఘాల ఆందోళన తీవ్రం కావడంతో సమాచారం అందుకున్న మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) వెంటనే పాఠశాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పాఠశాల ఆవరణలో విక్రయానికి ఉంచిన పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు, టైలు, బెల్టుల నిల్వలను తనిఖీ చేశారు. యాజమాన్యం వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో వాటన్నింటినీ అధికారులు అక్కడికక్కడే సీజ్ చేశారు.
నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ కోసం విద్యావ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై తమ పోరాటం కొనసాగుతుందని డీఎస్ఎఫ్ఐ నాయకులు స్పష్టం చేశారు.