తల్లికి వందనం పథకం: జులై 10న తల్లుల ఖాతాల్లోకి రూ.13 వేలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. గతంలో జులై మూడో వారంలో నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అంతకంటే ముందుగానే జులై 10న లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ పథకం కింద ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా, ప్రతి విద్యార్థికి రూ.13,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది.
అయితే, నిధులు సకాలంలో అందుకోవాలంటే తల్లులు, విద్యార్థులు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులు సూచించారు. ఈ-కేవైసీ పూర్తి చేసిన లబ్ధిదారుల ఖాతాల్లోనే జులై 10న ఎలాంటి ఆటంకాలు లేకుండా నిధులు జమ కానున్నాయి.
ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను విద్యాశాఖ వేగంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం. తల్లులు తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ అనుసంధానం, ఈ-కేవైసీ వివరాలను ముందుగానే ధృవీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.