సుంకొల్లులో కోడి పందాల స్థావరంపై మెరుపు దాడి
సుంకొల్లులో కోడి పందాల స్థావరంపై మెరుపు దాడి – 9 మంది అరెస్ట్, నగదు, వాహనాలు స్వాధీనం
ఏలూరు జిల్లా నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో కోడి పందాల స్థావరంపై నూజివీడు రూరల్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించి 9 మందిని అరెస్ట్ చేశారు. నూజివీడు రూరల్ ఎస్ఐ జ్యోతి బసు తమ సిబ్బందితో కలిసి ఈ దాడి చేపట్టారు.
నూజివీడు రూరల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు, కోడిపందాల నిర్వాహకులకు గట్టి షాక్ ఇచ్చారు. ఎస్ఐ జ్యోతి బసుకు అందిన పక్కా సమాచారం మేరకు సుంకొల్లు గ్రామంలో నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు.
పోలీసుల రాకను గమనించిన జూదగాళ్లు అక్కడి నుంచి పారిపోవడానికి యత్నించగా, పోలీసులు చాకచక్యంగా చుట్టుముట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో కోడి పందాలు ఆడుతున్న 9 మందిని అరెస్ట్ చేశారు.
నిందితుల వద్ద నుండి రూ. 6,480 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే పందెం రాయుళ్లకు చెందిన 11 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలంలో 3 కోడి పుంజులు, 2 కోడి కత్తులను కూడా పోలీసులు రికవరీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ జ్యోతి బసు మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ యువతను వ్యసనాల వైపు మళ్లించే కోడి పందాలు, పేకాట వంటి జూద కార్యకలాపాలపై నిరంతరం డ్రోన్ కెమెరాల నిఘా కొనసాగుతుందని హెచ్చరించారు.
చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, అవసరమైతే రౌడీషీట్లు కూడా తెరవడంలో వెనుకాడబోమని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఎక్కడైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి బాధ్యతాయుతమైన పౌరులుగా సహకరించాలని ప్రజలను కోరారు.