శివనేనిగూడెం వాసి రుద్రవరం సునీల్కు పీహెచ్డీ డాక్టరేట్
శివనేనిగూడెం వాసి రుద్రవరం సునీల్కు పీహెచ్డీ డాక్టరేట్
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం గ్రామానికి చెందిన రుద్రవరం సునీల్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రెస్నోట్ విడుదల చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్లో ప్రొఫెసర్ ఎస్.ఎఫ్. చంద్రశేఖర్ సూపర్వైజర్గా, ప్రొఫెసర్ చింత గణేష్ జాయింట్ సూపర్వైజర్గా వ్యవహరించిన పరిశోధనలో సునీల్ డాక్టరేట్ సాధించారు. ఇంపాక్ట్ ఆఫ్ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ ఆన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై ఆయన పరిశోధన పూర్తి చేశారు. తనకు లభించిన డాక్టరేట్ను తల్లిదండ్రులు చంద్రయ్య, యాదమ్మలకు అంకితం చేస్తున్నట్లు సునీల్ తెలిపారు. తన పరిశోధనకు సహకరించిన ప్రొఫెసర్లు, తోటి పరిశోధక విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు సునీల్ను అభినందించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ చిన్నతనంలో తమ గ్రామం నుంచి చిట్యాల ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేందుకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కలిపి సుమారు 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేవాడినని గుర్తుచేశారు. ఒకవైపు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంటూనే మరోవైపు చదువును నిర్లక్ష్యం చేయకుండా ముందుకు సాగానని తెలిపారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని, అది సాధించే వరకు ఎక్కడా వెనుకడుగు వేయవద్దని ప్రస్తుత విద్యార్థులకు సూచించారు.