టాస్క్ బేస్డ్ జాబ్ ఫ్రాడ్స్పై గవర్నర్పేట పోలీసుల అప్రమత్తత పిలుపు
పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో మోసాలకు గురికావద్దని ప్రజలకు సూచన
విజయవాడ, ఆగస్టు 25:
సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ గవర్నర్పేట పోలీసులు సూచించారు. పెరుగుతున్న ఆన్లైన్ మోసాల నేపథ్యంలో గవర్నర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు, వ్యాపారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఇటీవల విస్తరిస్తున్న టాస్క్ బేస్డ్ జాబ్ ఫ్రాడ్స్, పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలపై పోలీసులు ప్రజలకు వివరించారు.
యూట్యూబ్ వీడియోలకు లైక్లు ఇవ్వడం, గూగుల్ రివ్యూలు రాయడం, ఆన్లైన్ రేటింగ్లు ఇవ్వడం ద్వారా రోజుకు వేల రూపాయలు సంపాదించవచ్చంటూ వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలను నమ్మవద్దని హెచ్చరించారు. ఇలాంటి ఆకర్షణీయమైన ప్రకటనల వెనుక సైబర్ నేరగాళ్ల మోసపూరిత వ్యూహాలు ఉంటాయని తెలిపారు.
మొదట చిన్న మొత్తంలో డబ్బులు చెల్లించి నమ్మకం కలిగించే సైబర్ నేరగాళ్లు.. ఆ తర్వాత ప్రీమియం టాస్క్లు, అధిక లాభాల పెట్టుబడులు అంటూ పెద్ద మొత్తాల్లో డబ్బులు వసూలు చేసి బాధితులను మోసం చేస్తున్నారని పోలీసులు వివరించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడి ఆహ్వానాల విషయంలో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే స్పందించాలని సూచించారు.
గవర్నర్పేట పరిధిలోని ప్రధాన వీధులు, మార్కెట్ ప్రాంతాల్లో పోలీసులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, మైకుల ద్వారా సైబర్ మోసాలు, లోన్ యాప్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆన్లైన్ లావాదేవీల సమయంలో జాగ్రత్తలు పాటించాలని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం, ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.
సైబర్ మోసానికి ఎవరైనా గురైతే వెంటనే స్పందించి 1930 సైబర్ హెల్ప్లైన్ నంబర్కు సమాచారం ఇవ్వాలని లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేస్తే మోసపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.