టీటీడీ కల్యాణ మండపం భూమిపై సమగ్ర విచారణ జరపాలి
టీటీడీ కల్యాణ మండపం భూమిపై సమగ్ర విచారణ జరపాలి
నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో టీటీడీ కల్యాణ మండపం నిర్మాణం కోసం కేటాయించిన భూమి అన్యాక్రాంతంపై ఏసీబీ, విజిలెన్స్ శాఖలతో సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ డిమాండ్ చేశారు. భూమికి సంబంధించిన వాస్తవాలను వెలికితీసి ప్రజల ముందు ఉంచాలని కోరారు. సుమారు 16 ఏళ్ల క్రితం చిట్యాలలో టీటీడీ కల్యాణ మండపం నిర్మించాలని కోరుతూ పెద్దలు, ప్రజలతో కలిసి గుత్తా సుఖేందర్ రెడ్డి నిరాహార దీక్ష చేపట్టిన విషయాన్ని సంజయ్ దాస్ గౌడ్ గుర్తు చేశారు. అప్పటి కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన లిఖితపూర్వక హామీ మేరకు ఆయన దీక్ష విరమించారని తెలిపారు. టీటీడీ కల్యాణ మండపం భూమి విషయంలో వాస్తవాలను వెలికితీయకుండా చిట్యాల మున్సిపల్ చైర్మన్ దంపతులపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజల చందాలతో భూమి కొనుగోలు చేసినట్లు పేర్కొంటున్న నేపథ్యంలో 1.12 గుంటల భూమికి గజం భూమి తగ్గిన అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భూమి కబ్జాకు గురైందా లేదా అన్న విషయాన్ని అధికారిక రికార్డుల ఆధారంగా తేల్చాలని కోరారు. ప్రభుత్వ భూమి, టీటీడీకి సంబంధించిన భూమి విషయంలో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా చిట్యాల ప్రజలంతా ఈ అంశంపై సమరశీల పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైతే తాను మళ్లీ నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని సంజయ్ దాస్ గౌడ్ ప్రకటించారు. టీటీడీ కల్యాణ మండపం భూమికి సంబంధించిన పాత రికార్డులు, గతంలో ఇచ్చిన హామీలు, భూమి కొలతలు, ప్రస్తుత స్థితిగతులపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.