మధుసూదన్ నాయుడుకు కేశవమూర్తి వర్గం మద్దతు
35 మంది టీడీపీ కార్యకర్తలు నూతన ఇన్చార్జిని కలిసి సంఘీభావం
పుంగనూరు | Ntoday News
పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి నూతన నియోజకవర్గ ఇన్చార్జి వై. మధుసూదన్ నాయుడుతో కలిసి పనిచేస్తామని సీనియర్ టీడీపీ నాయకుడు కేశవమూర్తి తెలిపారు. సుమారు 30 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న తాను, పార్టీ గెలుపు కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని, అక్రమ కేసులు ఎదురైనా పార్టీని వీడకుండా పనిచేశామని ఆయన పేర్కొన్నారు.
గత రెండు సంవత్సరాల్లో పార్టీ కార్యక్రమాల్లో తమకు తగిన ప్రాధాన్యం లభించలేదని, తమ సమస్యలను కూడా పట్టించుకోలేదని కేశవమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ తమకు ప్రాణంతో సమానమని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి నూతన ఇన్చార్జిగా మధుసూదన్ నాయుడు బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. చిన్న వయసులోనే కీలక బాధ్యతలు చేపట్టిన మధుసూదన్ నాయుడిని ఆరు మండలాల నాయకులు, కార్యకర్తలు కోరుకుని ఇన్చార్జిగా తీసుకురావడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేశవమూర్తితో పాటు సుమారు 35 మంది టీడీపీ కార్యకర్తలు పుంగనూరులోని పార్టీ కార్యాలయంలో మధుసూదన్ నాయుడిని కలిసి తమ మద్దతు తెలిపారు. ఇకపై నియోజకవర్గంలో టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు, పార్టీ విజయానికి నూతన ఇన్చార్జితో కలిసి పనిచేస్తామని వారు ప్రకటించారు.
ఇటీవల మధుసూదన్ నాయుడు పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.