ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షలు సరిపోవు: రాజగోపాల్రెడ్డి
నిర్మాణ వ్యయం రూ.10–15 లక్షలకు చేరింది.. సాయం పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
హైదరాబాద్ | Ntoday News
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రస్తుత పరిస్థితుల్లో సరిపోవడం లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.
నిర్మాణ రంగంలో కూలీలు, మేస్త్రీల చార్జీలు భారీగా పెరిగాయని, మేస్త్రీలు, లేబర్ ఖర్చులకే సుమారు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అవుతోందని తెలిపారు. సిమెంట్, ఇసుక, స్టీల్, ఇటుకలు తదితర నిర్మాణ సామగ్రి ధరలు కూడా పెరగడంతో ప్రస్తుతం ఒక ఇల్లు నిర్మించాలంటే రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చవుతోందని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ కొంతమంది లబ్ధిదారులు ఆర్థిక స్థోమత లేక నిర్మాణ పనులను ప్రారంభించలేకపోతున్నారని రాజగోపాల్రెడ్డి తెలిపారు. మరికొందరు అప్పులు చేయడం, బంగారం తాకట్టు పెట్టడం ద్వారా ఇళ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. అందువల్ల ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.
అలాగే ఆటోలు, ట్రాక్టర్లు ఉన్నాయనే కారణంతో కొంతమంది పేదలను ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అనర్హులుగా పరిగణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నిజంగా నిరుపేదలుగా ఉన్న కుటుంబాలకు ఇళ్లు అందేలా నిబంధనలను సడలించి, అర్హతను మానవీయ కోణంలో పరిశీలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.