టమోట మార్కెట్ కు అనువైన స్థలాన్ని కేటాయించాలి
టమోట మార్కెట్ కు అనువైన స్థలాన్ని కేటాయించాలి
హైవే రోడ్డు పక్కనే ఉండడంతో రోడ్డు ప్రమాదాలు
మార్కెట్ చిన్నది కావడంతో ఎగుమతి దిగుమతులకు ఇబ్బందులు సీపీఐ
ములకలచెరువు,
అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గం, ములకలచెరువు మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ టమోటా మార్కెట్ యార్డును రైతులకు, ప్రజలకు అనువైన చోట స్థలం కేటాయించి మార్కెట్ ను ఏర్పాటు చేయాలని
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా సమితి సభ్యులు షేక్ నిజాముద్దీన్ కోరారు. సోమవారం పత్రికా విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న టమోటా మార్కెట్లలో మదనపల్లి, ములకలచెరువు మండలంలో ఉన్నటువంటి టమోటా మార్కెట్ లు అతి పెద్దగా ఉన్నాయన్నారు. ఈ రెండు మార్కెట్లకు రైతులు పెద్ద ఎత్తున టమోటాలు తరలిస్తుంటారు. తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన పెద్దమండెం, తంబళ్లపల్లి, బి. కొత్తకోట, కురబలకోట, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు మండలాలకు చెందిన రైతులు టమోటా పంట సాగు పైన ఆధారపడి ఎక్కువగా జీవనం సాగిస్తున్నారు. వర్షాధార పంటగా ఖరీఫ్లో వేరుశనగ పంట సాగుచేసినా ఏడాది పొడవునా రైతులు వ్యవసాయ బోర్లు కింద టమోటా పంటనే ఎక్కువగా సాగు చేస్తారు.
ప్రతిరోజు ములకలచెరువు మార్కెట్ కు ఈ ప్రాంత వాసులే కాకుండా పక్కనున్న సత్యసాయి, అనంతపురం జిల్లా రైతులు, కర్ణాటకా రాష్ట్రానికి చెందిన రైతులు కూడా టమోటాలు ములకలచెరువు మార్కెట్ కు తరలిస్తారు. ప్రతిరోజు 500 క్వింటాల నుండి 800 క్వింటాళ్ల వరకు ములకలచెరువు మార్కెట్ నుండి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. ఏడాదికి ములకలచెరువు టమోటా మార్కెట్ కు రూ. 1.55 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నట్లు తెలిపారు. 1992వ సంవత్సరంలో ఏర్పాటైన ఈ టమోటా వ్యవసాయ మార్కెట్ కు అప్పట్లో స్థలాన్ని కొద్దిగా కేటాయించారు. అయితే ప్రతిరోజు పెద్ద ఎత్తున టమోటాలు ఎగుమతి దిగుమతులు కావడంతో మార్కెట్ స్థలం ఇరుకుగా మారింది. టమోటాల ఎగుమతి కోసం లారీలు కంటైనర్లలో లోడింగ్, అన్లోడింగ్ లకు స్థలం సరిపోవడం లేదు. దాదాపుగా మార్కెట్లో మూడు వేల మందికి పైగా ప్రతిరోజు కూలీలు పనిచేస్తున్నారు. దీనికి తోడు మార్కెట్ జాతీయ రహదారి అనుకొని ఉండడంతో రోడ్డు ప్రమాదాలు నిత్యమూ జరుగుతున్నాయి. వాహనాల రాకపోకలకు, ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు గుర్తించి వ్యవసాయ టమాటో మార్కెట్ కు పెద్ద ఎత్తున స్థలం కేటాయించి మార్కెట్ ను అనువైన స్థలానికి మార్చాలని జిల్లా కలెక్టర్, మార్కెట్ కమిషనర్లను కోరుతున్నట్లు ఆయన తెలిపారు.