రెండు మండలాలకు ఉపయోగపడే రహదారి నిర్మాణానికి కొత్తచెరువు మట్టి వినియోగానికి అనుమతి ఇవ్వాలి: నక్కా రాము
చాట్రాయి, జూలై 10: చాట్రాయి మండలం–విస్సన్నపేట మండలాల సరిహద్దులో ఉన్న పొలిమేర రహదారిని సూరంపాలెం రైతులు సొంత నిధులతో నిర్మిస్తున్నారని, అయితే సమీపంలోని కొత్తచెరువు నుంచి మట్టి తరలించేందుకు అనుమతి లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని నూజివీడు నియోజకవర్గం ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన మాట్లాడుతూ, కలగర శివారు ములగలపార్టివారి గూడెం సమీపంలో ఉన్న కొత్తచెరువు ఆయకట్టులో సుమారు 80 శాతం భూములు సూరంపాలెం రైతులవేనని తెలిపారు. అయితే ఆ చెరువు విస్సన్నపేట రెవెన్యూ పరిధిలో ఉండటంతో మట్టి తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించడం లేదని పేర్కొన్నారు.
విస్సన్నపేట మండలం వైపు ఒక పక్క, చాట్రాయి మండలం వైపు మరో పక్క ఆనుకుని ఉండే ఈ రహదారి రెండు మండలాల రైతులకు ఉపయోగపడేలా ఉంటుందని తెలిపారు. రైతులందరూ చందాలు వేసుకుని ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఈ రహదారి నిర్మాణం చేపడుతున్నప్పటికీ, కొత్తచెరువు నుంచి మట్టి తీసుకురావడానికి అనుమతి లేకపోవడంతో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చనుబండ రెవెన్యూ పరిధిలోని సూరమ్మ చెరువు నుంచి మట్టి తరలించి రహదారి నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు.
రైతుల అవసరాల కోసం, ఇండ్ల నిర్మాణం, గ్రామీణ రహదారుల అభివృద్ధి వంటి ప్రజాప్రయోజన కార్యక్రమాల కోసం కొత్తచెరువు మట్టిని వినియోగించుకునేందుకు సంబంధిత అధికారులు వెంటనే అనుమతి ఇవ్వాలని నక్కా రాము విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రైతులు దార్ల వెంకటేశ్వరరావు, మాటూరు వెంకటేశ్వరరావు, బుబత్తుల ప్రసాద్, బుబత్తుల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.