యూఏపీఏ రద్దు చేయాలని విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం
విజయవాడ, జూలై 10: విజయవాడ నగరంలో సీపీఐ ఆధ్వర్యంలో యూఏపీఏ (చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ మాట్లాడుతూ, ప్రశ్న రావణ్పై యూఏపీఏ చట్టాన్ని ప్రయోగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
యూఏపీఏ చట్టాన్ని రద్దు చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టం భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే విధంగా అమలవుతోందని విమర్శించారు. మతోన్మాద, ఫాసిస్ట్ శక్తుల బుల్డోజర్ పాలన ఆంధ్రప్రదేశ్లో కొనసాగదని, గొప్ప పోరాట స్ఫూర్తి కలిగిన రాష్ట్ర ప్రజలు దానిని తిప్పికొడతారని హరినాథ్ అన్నారు.
అణిచివేతలకు పాల్పడిన పాలకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఈ సమావేశానికి ఈశ్వరయ్య అధ్యక్షత వహించగా, సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె. నారాయణ, సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి. మధు, న్యూ డెమోక్రసీ నాయకుడు పి. ప్రసాద్, మాజీ ఇంటెలిజెన్స్ అధికారి టి. వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు, జల్లి విల్సన్, అక్కినేని వనజ, ఎంసీపీఐ నాయకుడు ఖాదర్ బాషా, ఎస్యూసీఐ నేత అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.