పర్వతాపురం అటవీ ప్రాంతంలో విత్తన బంతుల వెదజల్లింపు కార్యక్రమం
ఏలూరు జిల్లా నూజివీడు అటవీశాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "విత్తన బంతులను వెదజల్లు" కార్యక్రమాన్ని జూలై 1 నుంచి నిర్వహిస్తున్నారు. "మొక్కలు నాటుదాం – భవిష్యత్తు కాపాడుకుందాం, హరిత భవిష్యత్తు కోసం అందరం ఏకమవుదాం" అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పర్వతాపురం అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో, డీఆర్వో హనుమంతుడు పర్యవేక్షణలో బీట్ ఆఫీసర్ నూర్జహాన్, అడవి సంరక్షణ కమిటీ చైర్మన్ మిద్దె సత్యనారాయణతో కలిసి పలు రకాల విత్తన బంతులను అడవిలో వెదజల్లారు.
ఈ సందర్భంగా అటవీ అధికారులు మాట్లాడుతూ, వర్షాకాలాన్ని సద్వినియోగం చేసుకుని విత్తన బంతులను వెదజల్లడం ద్వారా అడవుల విస్తీర్ణం పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.