తెలంగాణలో ముదురుతున్న ‘టీఆర్ఎస్’ టైటిల్ వివాదం
కవిత పార్టీ పేరు మార్చుకోక తప్పదా?
హైదరాబాద్, జులై 5: మాజీ ఎమ్మెల్సీ ఏర్పాటు చేయాలని భావిస్తున్న కొత్త రాజకీయ పార్టీ పేరు చుట్టూ వివాదం ముదురుతోంది. తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ శక్తిని నిర్మించాలని కవిత ప్రయత్నిస్తుండగా, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆమెకు ఊహించని షాక్ ఇచ్చింది.
కవిత తన కొత్త పార్టీకి "తెలంగాణ రక్షణ సేన" అనే పేరును ప్రకటించారు. ఈ పేరుకు సంక్షిప్త రూపం "టీఆర్ఎస్"గా రావడం ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువైంది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును కూడా టీఆర్ఎస్గానే పిలిచేవారు. ఆ పార్టీ తర్వాత భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారినప్పటికీ, "టీఆర్ఎస్" అనే పేరు ప్రజల్లో ఇంకా బలమైన గుర్తింపును కలిగి ఉంది.
ఈ నేపథ్యంలో "తెలంగాణ రక్షణ సేన" పేరును కేటాయించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం. దీంతో ఈసీ కవితకు లేఖ రాసి, ప్రస్తుత పేరును ఆమోదించడం సాధ్యం కాదని, 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని కోరినట్లు తెలుస్తోంది.
కొత్త రాజకీయ పార్టీని నమోదు చేసే ప్రక్రియలో ఇప్పటికే ఉన్న పార్టీల పేర్లతో సారూప్యత లేకుండా ఉండటం, సంక్షిప్త నామాలు ఒకేలా వినిపించకుండా చూసుకోవడం వంటి నిబంధనలు ఉంటాయి. ఈ నిబంధనల ప్రకారమే కవిత ప్రతిపాదించిన పార్టీ పేరు పరిశీలనలో నిలిచిపోయినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే ఈసీ నిర్ణయంపై కవిత వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. పార్టీ పేరు మార్చే ఉద్దేశం లేదని, అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధమని ఆమె ప్రకటించారు. దీంతో "టీఆర్ఎస్" టైటిల్ వివాదం ఇప్పుడు రాజకీయంగా మరింత ఆసక్తికరంగా మారింది.
కవిత కోర్టును ఆశ్రయిస్తారా? లేక ప్రత్యామ్నాయ పేర్లను సూచిస్తారా? అనే అంశాలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.