తిరువూరు ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్కు కొత్త శోభ.. ప్రారంభానికి సిద్ధమైన 11 దుకాణాలు
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో శిధిలావస్థకు చేరిన షాపింగ్ కాంప్లెక్స్కు కొత్త రూపు వచ్చింది. ఆర్టీసీ ఆధీనంలోని 11 దుకాణాలతో కూడిన వ్యాపార సముదాయం ప్రారంభానికి సిద్ధమైంది.
దీర్ఘకాలంగా నిరుపయోగంగా ఉన్న ఈ షాపింగ్ కాంప్లెక్స్ను లీజు ప్రాతిపదికన అద్దెకు తీసుకున్న ప్రముఖ కాంట్రాక్టర్ పసుపులేటి శేఖర్ బాబు తన సొంత వ్యయ, ప్రయాసలతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. ఆధునిక సౌకర్యాలతో భవనాన్ని పునర్నిర్మించి వ్యాపార కార్యకలాపాలకు అనుకూలంగా తీర్చిదిద్దారు.
ప్రధాన సెంటర్లో ఉన్న ఈ వ్యాపార సముదాయాన్ని చిరు వ్యాపారులు, వినియోగదారులు, ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నిర్వాహకుడు పసుపులేటి శేఖర్ బాబు తెలిపారు.
నిన్నటి వరకు చెత్త, చెదారం, వ్యర్థాలతో అధ్వాన్నంగా కనిపించిన ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్, అతి త్వరలో వివిధ వ్యాపార సంస్థలు, వినియోగదారుల రాకతో సందడిగా మారనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.