తిరువూరు రచయిత్రికి 'అక్షర రత్న' జాతీయ ప్రతిభా పురస్కారం
తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నియోజకవర్గానికి చెందిన రచయిత్రి, ఉపాధ్యాయిని ఈడే వెంకట భరత కుమారికి ప్రతిష్ఠాత్మకమైన 'అక్షర రత్న' జాతీయ ప్రతిభా పురస్కారం లభించింది.
విజయవాడలోని చాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో శ్రీశ్రీ కళా వేదిక, సవ్యసాచి గ్రూప్స్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కృష్ణవేణి కవితోత్సవం–169వ అఖిల భారత ద్విశతాధిక కవి సమ్మేళనం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ఈడే వెంకట భరత కుమారి రచించిన 'భారతీయం' శతక సరళపద్య రచనకు గుర్తింపుగా 'అక్షర రత్న' జాతీయ ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆమెను శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించి ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
అదే కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గంలోని ఏ.కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు, రచయిత విశ్వనాధుని శంకరాచారి కవి సమ్మేళనంలో పాల్గొని తన కవితను వినిపించారు. ఆయనను కూడా శాలువా, జ్ఞాపికతో సత్కరించి ప్రశంసాపత్రాన్ని బహూకరించారు.
ఈ కార్యక్రమం శ్రీశ్రీ కళా వేదిక చైర్మన్ కళారత్న కత్తిమండ ప్రతాప్ కుమార్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరీ భూషణం, జాతీయ ప్రణాళిక అధికారి టి. పార్థసారథి సారథ్యంలో నిర్వహించారు.
ఈడే వెంకట భరత కుమారికి జాతీయ స్థాయి పురస్కారం లభించడం పట్ల పెనుగొలను శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు, పలువురు సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.