తుమ్మగూడెంలో దిక్కులేని నలుగురు చిన్నారులకు అండగా నిలిచిన పోలీసులు
తుమ్మగూడెంలో దిక్కులేని నలుగురు చిన్నారులకు అండగా నిలిచిన పోలీసులు
శక్తి టీమ్ చొరవతో రక్షణ.. శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పునరావాసం
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం తుమ్మగూడెం గ్రామంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న నలుగురు చిన్నారులకు ఏలూరు జిల్లా పోలీసులు, శిశు సంక్షేమ శాఖ అధికారులు అండగా నిలిచారు.
తుమ్మగూడెం గ్రామానికి చెందిన తుమ్మల శేఖర్, చుక్కమ్మ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. సుమారు ఆరు సంవత్సరాల క్రితం తల్లి చుక్కమ్మ ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. అనంతరం తండ్రి శేఖర్ రెండో వివాహం చేసుకున్నాడు.
అయితే సవతి తల్లి పిల్లలను సరిగా చూసుకోకపోవడంతో పాటు, తండ్రి శేఖర్ మరో కేసులో జైలుకు వెళ్లడంతో నలుగురు పిల్లలు సంరక్షణ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు ఆ చిన్నారులు రోడ్లపై తిరుగుతూ, అడుక్కుంటూ దయనీయ పరిస్థితికి చేరుకున్నారు.
పిల్లల పరిస్థితిని గమనించిన గ్రామ పెద్దలు వెంటనే చాట్రాయి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగారు.
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా శక్తి టీమ్ ఇన్చార్జ్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం. సుబ్బారావు ఆధ్వర్యంలో ఏలూరు టౌన్ శక్తి టీమ్, నూజివీడు శక్తి టీమ్ సిబ్బంది, స్థానిక అంగన్వాడీ సిబ్బందితో సమన్వయం చేసుకుని నలుగురు చిన్నారులను సురక్షితంగా రక్షించారు.
అనంతరం పిల్లలను ఏలూరు డీసీపీఓ డాక్టర్ సీహెచ్ సూర్య చక్రవేణికి అప్పగించారు. అధికారుల సమక్షంలో చిన్నారులకు అవసరమైన కౌన్సెలింగ్ నిర్వహించారు.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు నలుగురు పిల్లలకు సురక్షితమైన వసతి, భోజనం, విద్య అందించే విధంగా ఆశ్రయం కల్పించారు.
కష్టకాలంలో రోడ్డున పడిన చిన్నారులకు రక్షణ కల్పించి, పునరావాసం అందించడంలో ఏలూరు జిల్లా శక్తి టీమ్, పోలీసు శాఖ, శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించి మానవత్వాన్ని చాటుకున్నారు.