తుంగభద్రలో విషాదం – పెళ్లి సందడి మధ్య నలుగురు మృతి
తుంగభద్రలో విషాదం – పెళ్లి సందడి మధ్య నలుగురు మృతి
కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోసిగి ఆర్డీఎస్ ఆనకట్ట సమీపంలోని తుంగభద్ర నదిలో స్నానానికి దిగిన నలుగురు మృతి చెందారు.
కర్ణాటక రాష్ట్రంలోని మాన్వి ప్రాంతానికి చెందిన 15 మంది రెండు రోజుల క్రితం కందుకూరు గ్రామానికి పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వచ్చారు. వివాహ కార్యక్రమం ముగిసిన అనంతరం శుక్రవారం ఉదయం వారు అందరూ కలిసి నదిలో స్నానానికి వెళ్లారు.
ఈ సందర్భంగా ఈత రాని నలుగురు వ్యక్తులు అకస్మాత్తుగా లోతైన నీటిలోకి వెళ్లి మునిగిపోయారు. వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం.
స్థానికులు, పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనతో పెళ్లి వేడుకలో విషాద ఛాయలు అలుముకున్నాయి.