Voter List Revision: రాజక్కపల్లిలో ఓటర్ల జాబితా సవరణపై అవగాహన సదస్సు.. కీలక సూచనలు చేసిన ఎంఆర్ఓ శేఖర్
రాజక్కపల్లి | NTODAY NEWS
భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision - SIR) కార్యక్రమంలో భాగంగా రాజక్కపల్లి గ్రామంలో ఆదివారం ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్ఓ శేఖర్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, గ్రామ సర్పంచ్ దోరిశెట్టి మల్లేశం అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఎంఆర్ఓ శేఖర్ మాట్లాడుతూ, ఓటరు నమోదు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ సరైన వివరాలతో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
ఓటరు నమోదు సమయంలో ప్రతి ఓటరు తమ పాత ఫోటోతో పాటు ప్రస్తుత ఫోటోను తప్పనిసరిగా జత చేయాలని తెలిపారు. అలాగే పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, తల్లిదండ్రుల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.
వివాహితులు తమ జీవిత భాగస్వామి వివరాలను తప్పనిసరిగా పొందుపరచాలని, అలాగే 2002లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటరు జాబితాలో ఉన్న తల్లిదండ్రులు లేదా తాతమ్మల (గ్రాండ్ పేరెంట్స్) వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయడం అవసరమని వివరించారు.
ఓటరు జాబితాను తప్పులు లేకుండా, మరింత పారదర్శకంగా రూపొందించేందుకు గ్రామ ప్రజలందరూ సహకరించాలని ఎంఆర్ఓ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఎల్ఓ దోరిశెట్టి తిరుమల, ఆర్ఐ రామిరెడ్డి, మహేశ్ తదితర అధికారులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.