www.ntodaynews.com
వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
తెలంగాణ
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్: లక్ష్మణ్ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ధర్మపురి పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారి అభిషేకం, ఉత్తర ద్వార పూజ కార్యక్రమాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జువ్వాడి నర్సింగరావుతో కలిసి పాల్గొన్నారు.
వేకువజాము నుంచే ఆలయంలో స్వామివారికి ప్రత్యేక సుప్రభాత సేవ, అభిషేకాలు, అలంకార పూజలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ఉత్తర ద్వార తలుపులను తెరిచి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ నేత జువ్వాడి నర్సింగరావు ప్రత్యేక పూజల్లో పాల్గొని రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, శాంతి సమృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ముక్కోటి ఏకాదశి పర్వదినం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగి ఉందని, భక్తిభావంతో చేసే ప్రార్థనలు ప్రజలకు మానసిక శాంతిని కలిగిస్తాయని తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ, దేవస్థాన సిబ్బంది, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. క్యూలైన్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, పండితులు, ఇతర ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube