వానాకాలం సాగుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
ఖచ్చితమైన వర్షపాత అంచనాలతో రైతులకు అవగాహన కల్పించాలి
పంట అవశేషాలు తగులబెడితే రూ. 2,500 నుండి రూ. 15,000 వరకు జరిమానా
నస్పూర్ సమీకృత కలెక్టరేట్లో వ్యవసాయ అధికారులతో సమీక్ష
రాబోయే వానాకాలం వ్యవసాయ సీజన్కు సంబంధించి జిల్లాలో ముందస్తు సాగు ప్రణాళికను సిద్ధం చేయాలని, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖతో కలిసి సహాయ వ్యవసాయ అధికారులు, మండల వ్యవసాయ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్-నినో ప్రభావం వల్ల ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున, రైతులు పంటల వైవిధ్యీకరణ, మిశ్రమ మరియు స్వల్పకాలిక పంటల సాగు చేపట్టేలా ప్రోత్సహించాలని, భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడే విత్తనాలు వేసేలా సూచించాలని కలెక్టర్ తెలిపారు.
పొలాల్లో పంట అవశేషాలను తగులబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరగడమే కాకుండా నేల సారం దెబ్బతింటుందని, ఈ చర్యలను పూర్తిగా నిరోధించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పంట అవశేషాలను దహనం చేసే రైతులకు గ్రామపంచాయతీల ద్వారా రూ. 2,500 నుండి రూ. 15,000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే, కొనుగోలు కేంద్రాలలో వారు విక్రయించే ధాన్యానికి సంబంధించిన టోకెన్ల జారీని నిలిపివేస్తామని అధికారులకు తేల్చి చెప్పారు.
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ సాగును పెంచేందుకు ‘జాతీయ సహజ వ్యవసాయ మిషన్’ కింద జిల్లాలోని 17 క్లస్టర్లలో క్లస్టర్కు 125 మంది రైతులకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. నానో యూరియా వినియోగం, ఆయిల్ పామ్, మొక్కజొన్న మరియు 8 రకాల సన్న ధాన్యం సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ అధికారులు రాబోయే 10 రోజుల పాటు కచ్చితంగా గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశాలు నిర్వహించాలని, మండలాల వారీగా రైతు నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసి నివేదికలు అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా, మండల స్థాయి వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు