విజయవాడ ధర్నా చౌక్లో ఉద్రిక్తత.. సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి మున్సిపల్ కార్మికుల యత్నం..!
విజయవాడ ధర్నా చౌక్ వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరిన మున్సిపల్ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, మున్సిపల్ కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
మున్సిపాలిటీల్లో ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆప్కాస్ వ్యవస్థ ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందుతున్నాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆప్కాస్ను రద్దు చేసి ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి కార్మికులను నెట్టే కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడి పిలుపుతో ధర్నా చౌక్ వద్ద భారీగా మున్సిపల్ కార్మికులు చేరుకోగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.