విస్సన్నపేట : జగనన్న కాలనీ భూముల సమస్యలపై సీపీఎం నిరసన
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట : జగనన్న కాలనీ భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విస్సన్నపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు.
విస్సన్నపేటలో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు కేటాయించిన భూముల్లో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించే చర్యలను వెంటనే నిలిపివేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. అదేవిధంగా కాలనీ భూములకు రెవెన్యూ అధికారులు సరైన సరిహద్దులు ఏర్పాటు చేయకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
భూములను అధికారిక కొలతల ప్రకారం సరిహద్దులు నిర్ధారించి, లబ్ధిదారులకు స్పష్టంగా అప్పగించాలని కోరారు. సరిహద్దులు లేకపోవడం వల్ల భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తే అవకాశం ఉందని, అధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అనంతరం మండల రెవెన్యూ అధికారి కే. లక్ష్మీ కళ్యాణికి సీపీఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు విస్సంపల్లి నాగరాజు, మేకల జ్ఞాన రత్నం తదితరులు పాల్గొన్నారు.