విస్సన్నపేట మండలంలో ఎల్నినో ప్రభావ నివారణపై రైతులకు అవగాహన
విస్సన్నపేట, ఆగస్టు 5: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని మోడరేట్ రిస్క్ గ్రామాల్లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఎల్నినో ప్రభావం నుంచి ఉద్యాన పంటలను సంరక్షించుకునే అంశంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నూజివీడు మామిడి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డా. శాలి రాజు మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం వల్ల అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశమున్నందున రైతులు శాస్త్రీయ సాగు విధానాలను అనుసరించాలని సూచించారు. ముఖ్యంగా ఫామ్ పాండ్ల ఏర్పాటు, డ్రిప్ సాగు విధానం, వీడ్ మ్యాట్ల వినియోగం, ముందస్తు వర్షాకాల విత్తనాలు, నేలలో తేమను నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన మేరకు మాత్రమే నీటిని అందించడం వంటి చర్యలు పంటల రక్షణకు ఎంతో దోహదపడతాయని వివరించారు.
విస్సన్నపేట ఉద్యాన అధికారి బి. వాసవి సౌజన్య మాట్లాడుతూ, ఉద్యాన శాఖ ద్వారా ఫామ్ పాండ్లు, డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు నీటి సంరక్షణ చర్యలను తప్పనిసరిగా పాటించాలని, ప్రభుత్వ పథకాల ద్వారా లభించే సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు.
ఉద్యాన సహాయకుడు వెంకటేశ్వరరావు రైతులకు వివిధ ప్రభుత్వ పథకాలు, ఎల్నినో సమయంలో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై వివరించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎల్నినో ప్రభావ నివారణ చర్యలపై అవగాహన పొందారు.