విస్సన్నపేటలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
విస్సన్నపేటలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ ప్రసంగించారు.
దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు వంటి మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనని శక్తులు నేడు పాలనలో ఉన్నాయని విమర్శించారు.
ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన చారిత్రక బాధ్యత ప్రజలపై ఉందని హరినాథ్ పేర్కొన్నారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలను వెలుగులోకి తెచ్చి పాలకుల జవాబుదారీతనాన్ని ప్రశ్నించిన ప్రజాస్వామ్య శక్తులకు ఆయన అభినందనలు తెలిపారు.
భారతదేశం అనేక మతాలు, సంప్రదాయాలకు నిలయమని, మత విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వాదులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దళితులు, ముస్లింలు, మైనార్టీలపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణకుమారి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.