విస్సన్నపేటలో రాజకీయ ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా స్పందించారు. రాజకీయ విమర్శలు చేసే సమయంలో స్థాయిని మరిచి మాట్లాడటం తగదని హెచ్చరించారు.
డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని తాము ప్రశ్నిస్తే, తమను, తమ అధినాయకులను నోటికి వచ్చినట్లు విమర్శించడం సరికాదన్నారు. వార్డు సభ్యుడిగా కూడా గెలవని వారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నల్లగట్ల స్వామిదాసుపై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
గతంలో పోలీసుల కేసులో ఇబ్బందులు ఎదురైన సమయంలో ఎవరు సహాయం చేశారో గుర్తు చేసుకోవాలని అన్నారు. రౌడీషీట్ విషయంలో కూడా పోలీసులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేసింది నల్లగట్ల స్వామిదాసు కాదా అని ప్రశ్నించారు.
పార్టీ మారిన వ్యక్తి ఒక పార్టీలో ఉన్నప్పుడు దేవుడిగా, మరో పార్టీలోకి వెళ్లిన తర్వాత దయ్యంగా కనిపించడం ఎక్కడి న్యాయమని నిలదీశారు. వ్యక్తిగత విమర్శలు, పరస్పర ఆరోపణలు కాకుండా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రజల సమస్యలు, అవసరాలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఎవరిని గెలిపిస్తారో తేలుతుందని, ప్రజల తీర్పే అంతిమమని పేర్కొన్నారు.